
హైదరాబాద్: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యతో హైదరాబాదు ఒక్కసారి ఉలిక్కి పడింది. ముఠాలను నడిపే వ్యక్తుల జీవితాలకు ముగింపు ఇలాగే ఉంటుందేమోనన్నట్లు అతని హత్య జరిగింది. విప్లవ దేశభక్త పులులు సంస్థ పేరు మీద అతను మొదట్లో పత్రికలకు ప్రకటనలు పంపుతూ ఉండేవాడు. అలా అతను ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లలో, భూవివాదాల్లో తలదూరుస్తూ వచ్చాడని అంటారు. పరిటాల రవి హత్య కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. అయితే, ఆధారాలు లేకపోవడంతో అతన్ని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దాంతో అతను ఇటీవలే హైదరాబాదులోని చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. పరిటాల రవి హత్యపై అతను అప్పట్లో సంచలన ప్రకటనలు చేశాడు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు మొద్దు శ్రీను హత్యపై కూడా అతను టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. టీవీ చానెళ్లు అతని ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డాయి.
పటోళ్ల గోవర్ధన్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా తాండూరు. అతనికి ముగ్గురు అన్నదమ్ముళ్లు, ఓ అక్క ఉన్నారు. ఓ సోదరుడు ఎప్పుడూ అతని వెంటే ఉంటాడని అంటారు. అతను రాయలసీమ ఫాక్షన్ను అంతం చేస్తానని కూడా ప్రకటన చేశాడు. అతను పలు చోట్ల గాంధీ విగ్రహాలను కూల్చివేశాడు. పార్శిల్ బాంబులు పంపి వ్యాపారులను బెదిరించేవాడు. అతను ఇటీవల బోడుప్పల్లోని ఓ భూవివాదంలో తలదూర్చినట్లు వార్తలు వస్తున్నాయి. వ్యూహం ప్రకారమే ప్రత్యర్థులు పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని హత్య చేశారని అనుమానిస్తున్నారు. అనుచరులు కోవర్టులుగా మారి హత్యకు సహకరించి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలన్నీ టీవీ చానెళ్లలో వార్తాకథనాలుగా వచ్చాయి.
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యలో పాల్గొన్న ఐదుగురిని పట్టుకోవడానికి టాస్క్ఫోర్సు ఐదు టీమ్లను ఏర్పాటు చేసింది. ఆటో డ్రైవర్ను గోవర్దన్ రెడ్డితో పాటు ప్రయాణిస్తున్న వ్యక్తి బంధించాడు. మిగతావాళ్లు అతన్ని హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. ఆటో డ్రైవర్ ఇస్మాయిల్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని నయీమ్ గ్యాంగ్ హత్య చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేస్తూ టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే, అతనికి పలువురు శత్రువులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
pls