28, డిసెంబర్ 2011, బుధవారం

అనుచరులే.. అసురులు!


సిటీబ్యూరో, న్యూస్‌లైన్: గడిచిన ఏడాదిన్నర కాలంలో ఇతర జిల్లాలకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు నగరంలో హత్యకు గురయ్యారు. ఇద్దరిని మట్టుపెట్టింది నమ్మిన బంట్లుగా, ప్రధాన అనుచరులుగా ముద్రపడిన వారే కాగా.. మూడో దాంట్లోనూ అనుచరుల పాత్రపై గట్టి అనుమానాలున్నాయి. ఇప్పుడు పటోళ్ల విషయంలోనూ అనుచరుల సహకారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు అలియాస్ పండు 2010 సెప్టెంబరులో రాజధానిలో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ప్రధాన అనుచరుడైన ఆముదాల మహేందర్‌రెడ్డి అలియాస్ మహిపాల్‌రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టాడు. విశాఖపట్నంలో ఉన్న స్థలానికి సంబంధించిన లావాదేవీలే ఆయన హత్యకు కారణమయ్యాయి.

ఒంటరిగా ఉన్న పండును ఫ్లాట్‌లోనే వేటాడి, వెంటాడిన మహిపాల్ అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఏడాది జనవరి 3న హత్యకు గురైన అనంతపురం ఫ్యాక్షనిస్ట్ మద్దెలచెరువు సూరి విషయంలోనూ ఇలానే జరిగింది. ఇతనికి ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన భాను తన అనుచరుల ద్వారా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. నమ్మిన బంటులా వెంటే తిరుగుతూ.. వెనకనుంచి కాల్పులు జరిపి సూరిని మట్టుబెట్టాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఇతని కోసం పోలీసులు ఇప్పటికీ తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పుడు పటోళ్ల కేసులో భువనగిరి నయీంను అనుమానిస్తున్నప్పటికీ.. హత్య జరిగిన తీరును బట్టి గోవర్దన్‌రెడ్డి అనుచరులు సహకరించినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరి కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls